ముంబై, ఏప్రిల్ 10 : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ కు.. 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ను దోషిగా జోధ్పూర్ న్యాయస్థానం తేల్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఐదు సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ జోధ్పూర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్ బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. రెండు రోజులు జోధ్పూర్ సెంట్రల్ జైలులో గడిపిన సల్మాన్ బెయిలుపై శనివారం బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలో తన క్షేమం కోరుతూ ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. "నాకు ఎప్పుడూ మద్దతుగా ఉన్న ప్రియమైన వారికి, ధైర్యం కోల్పోని వారికి కన్నీటి కృతజ్ఞతలు. మీ ప్రేమ, ఆదరణను ఎల్లప్పుడూ అందిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు" అని తన పోస్ట్లో వెల్లడించారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సల్మాన్కు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సల్మాన్ జైలు నుంచి బెయిలుపై బయటికి రావడంతో అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు.