న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్లో ఓ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జర్నలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘సహారా సమయ్’ అనే హిందీ న్యూస్ ఛానల్లో అనుజ్ చౌదరీ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరు దుండగులు హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనాలపై వచ్చి అనుజ్ ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం అతనిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో బాధితుడి పొట్ట, కుడిచేతిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. స్థానిక బీఎస్పీ కౌన్సిలర్ భర్త అయిన అనూజ్ చౌదరీపై వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇతర కారణాలపైనా విచారణ చేపడతామని, దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.