ప్రదాని నివాసం వద్ద తెదేపా ఎంపీల ఆందోళన

SMTV Desk 2018-04-08 11:27:24  Andhra pradesh, special status, demand, tdp mps, delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాని ఇంటి ముట్టడికి టీడీపీ ఎంపీలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారి నిరసనల గురించి ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించడంతో పాటు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎంపీలు అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్, సీఎం రమేష్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు తదితరులంతా ప్రధాని నివాసం వద్దకు చేరుకోగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. అది నిషేధిత ప్రాంతమని నచ్చజెప్పినా ఎంపీలు వినక పోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు. అరెస్టులతో తమను ఆపలేరని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఎంపీలు స్పష్టం చేశారు.