జోధ్పూర్, ఏప్రిల్ 6: రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ళ శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిలు పిటిషన్ పై జోధ్పూర్ సెషన్స్ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సల్మాన్ తరపు న్యాయవాదుల వాదనలను పరిశీలించింది. తీర్పును శనివారానికి కోర్టు వాయిదా వేసింది. దీంతో సల్మాన్ జైలు జీవితం శుక్రవారం కూడా కొనసాగక తప్పదు. ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నమ్మరాదని సల్మాన్ తరపు న్యాయవాది వాదించారు. అటవీ శాఖపై ఆరోపణలు చేశారు. గతంలో ఇటువంటి కేసుల్లో నిందితులను నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టుకు తెలిపారు. బెయిల్ పై తీర్పు వెలువడేవరకూ ఆయన జోధ్ పూర్ జైల్లోనే గడపాల్సి ఉంటుంది.