బెంగళూరు, ఏప్రిల్ 5 : ఐపీఎల్ -11 కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ ఈ నెల 7న ప్రారంభంకానుంది. ఈ టీంలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ సారి కప్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. టీమిండియా క్రికెట్ జట్టు సారథిగా ఎన్నో సిరీస్ లు దక్కించుకొన్న విరాట్ ఈ ఐపీఎల్ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయాడు. పటిష్టమైన బ్యాటింగ్ లైనెప్ గల ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్ కు వెళ్లిన కప్ మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ సారి మాత్రం మా జట్టు ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుందని విరాట్ పేర్కొన్నారు. ఇదే విషయంపై కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ అనంతరం మాట్లాడుతూ.." ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానుల కంటే నాకే ఎక్కువగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవాలని ఉంది. పది సంవత్సరాలుగా ఆర్సీబీ జట్టులో ఉన్నాను. మూడు సార్లు(2016, 2011, 2009) ఫైనల్ వరకు వెళ్లాం. కానీ, ట్రోఫీ అందుకోలేకపోయాం. ఈ సారి మాత్రం మా జట్టు ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. 120 శాతం కష్టపడతాం’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.