పెట్రోల్‌ పంప్‌లో చెలరేగిన మంటలు

SMTV Desk 2018-03-26 15:04:03  Petrol tanker, fire accident, madhya pradesh

భోపాల్‌, మార్చి 26: మధ్యప్రదేశ్‌లోని ఓ పెట్రోల్‌ పంప్‌ వద్ద పెట్రోల్‌ నింపుతుండగా అకస్మాత్తుగా ట్యాంకర్‌కు మంటలు వ్యాపించాయి. ట్యాంకర్‌ డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి పెట్రోల్‌ పంపు నుంచి దూరంగా ఖాళీస్థలంలోకి ట్యాంకర్‌ను తీసుకెళ్ళాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. భోపాల్‌కు 220 కిమీ దూరంలోని నర్సింగ్‌పూర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్‌ ట్యాంకర్‌లో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాకున్నా ట్యాంకర్‌ నుంచి ఎగిసిన అగ్నికీలలు పెట్రోల్‌ పంప్‌కు వ్యాపించడంతో ఆందోళన నెలకొంది. డ్రైవర్‌ ఏమాత్రం ఆలస్యం చేసినా పెట్రోల్‌ పంప్‌ దగ్ధమై పరిసర ప్రాంతాలకు సైతం మంటలు వ్యాపించి భారీ నష్టం వాటిల్లేది. ట్యాంకర్‌ డ్రైవర్‌ సమయస్ఫూర్తితో అత్యంత వేగంగా సమీపంలోని ఖాళీ ప్రదేశానికి ట్యాంకర్‌ను తీసుకెళ్లడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ట్యాంకర్‌ డ్రైవర్‌కు కాలిన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.