న్యూఢిల్లీ, మార్చి24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గట్టి షాక్ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు కూటమి నుంచి వైదొలిగినట్లు ఘాటుగా లేఖలో స్పందించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తూ, అందుకు కారణాలు వివరిస్తూ అంతకుముందు చంద్రబాబు రాసిన లేఖకు అమిత్ గట్టిగానే బదులు లేఖ పంపించారు. చంద్రబాబు నిర్ణయంలో అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం అన్ని రకాలుగా సహకరించిందని స్పష్టం చేశారు. ఏపీ విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల హక్కులను పరిరక్షించడంలో బీజేపీ ముందుందని చెప్పారు. ఏపీ ప్రజల ఆకాంక్షలపట్ల బీజేపీకి ఏమాత్రం సానుభూతి లేదని మీరు (చంద్రబాబు) చెబుతున్న మాటలన్నీ కూడా అబద్ధాలు, నిరాధారాలు అని అమిత్షా ధ్వజమెత్తారు.