హరారె, మార్చి 24 : 2019 లో జరిగే ప్రపంచకప్ టోర్నీకు అఫ్గానిస్థాన్ జట్టు అర్హత సాధించింది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ చివరి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించి టోర్నీలో ఫైనల్కు అర్హత సాధించింది. ఇప్పటికే వెస్టిండీస్ 2019 టోర్నీ బెర్తు సంపాదించగా.. రెండో బెర్తును అఫ్గాన్ కైవసం చేసుకుంది. క్వాలిఫయర్స్లో ఫైనల్ చేరిన రెండు జట్లూ ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. తొలుత ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. స్టిర్లింగ్ (55), కెవిన్ ఓబ్రైన్ (41), నీల్ ఓబ్రైన్ (36) ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్ 3, జద్రాన్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత అఫ్గాన్ 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది. అఫ్గాన్ జట్టులో షహజాద్ (54), నైబ్ (45) రాణించారు. ఆదివారం జరుగనున్న టోర్నీ ఫైనల్లో వెస్టిండీస్తో అఫ్గానిస్థాన్ తలపడనుంది.