కొలంబో, మార్చి 19 : శ్రీలంక వేదికగా జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం ఓ మరుపురాని ఘట్టం. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడిలో టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (డీకే) చూపించిన ప్రదర్శన, అంకితభావం కోసం ఎంత చెప్పినా తక్కువే. ఒక దశలో ఓటమి అంచుకి జారిన భారత్ జట్టును విజయం వైపు తీసుకెళ్లిన ఘనుడు డీకే. ఫైనల్లో భాగంగా భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ లో లక్ష్య ఛేదనలో చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన తరుణంలో సిక్స్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే. కాగా ఛేజింగ్ లో అంతర్జాతీయ టీ20 ఫైనల్లో చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయం అందించిన తొలి భారత బ్యాట్స్మెన్గా దినేశ్ కార్తీక్ రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయం అందించిన ఐదో ఆటగాడిగానూ కార్తీక్ నిలిచాడు. డీకే కంటే ముందు చమర కపుగెదర (శ్రీలంక), ఇయాన్ మోర్గాన్ ( ఇంగ్లాండ్ ), జుల్ఫికర్ బాబర్ (పాకిస్థాన్), ఊసి సిబాండ (జింబాబ్వే), మాత్రమే చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టు విజయంలో ముఖ్యపాత్ర వహించారు.