ఢాకా, మార్చి 18 : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ రోజు బంగ్లాదేశ్ జట్టు రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత చాలా మంది ప్రముఖులు, అభిమానులు బంగ్లా జట్టుతీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) స్పందించింది. తమ దేశ ఆటగాళ్లే తప్పు చేశారంటూ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు బీసీబీ.. శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాసింది. ‘ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మా ఆటగాళ్లు వ్యవహరించారు. మా ఆటగాళ్ల తీరు మూలంగానే విధ్వంసకాండ జరిగింది. ఇతరులను రెచ్చగొట్టే విధంగా మైదానంలో ఆటగాళ్లు అలా ప్రవర్తించడాన్ని ఎవరూ సమర్ధించారు. తప్పంతా మా వాళ్లదే. అందుకు బీసీబీ క్షమాపణలు తెలియజేస్తోంది’ అంటూ బీసీబీ తెలిపింది.