సిరిసిల్ల, మార్చి 18 : మంత్రి ప్రోత్సాహంతోనే తాము కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు తీసుకుంటున్నామని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ పావని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాష్ట్రమంతా ఇదే తంతు జరుగుతుందని తనను తానూ సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణం సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న సామల పావని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిత్యమూ ప్రజాసేవలో ఉండే తమకు కాంట్రాక్టర్లు కమిషన్లు ఇస్తే తప్పేంటని అడిగారు. పర్సంటేజీలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించిన ఆమె, మినిస్టర్ గారి ప్రోత్సాహంతోనే కమిషన్లు తీసుకుంటున్నామని, కాని కొందరు కాంట్రాక్టర్లు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోనూ జరిగేది ఇదే తేల్చి చెప్పారు. తన కమిషన్ల లావాదేవీలు తన భర్త చూసుకుంటారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.