విజయవాడ, జూన్ 29 : ప్రముఖ బాడ్మింటన్, ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ విజేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ కిదాంబికి మరో అరుదైన గౌరవం దక్కింది. విజయవాడలో బుధవారం రోజున ఆయన కోసం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాడ్మింటన్ పోటీలో ప్రతిభ కనబరచినందులకు శ్రీకాంత్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున చంద్రబాబు అభినందిస్తూ రూ. 50 లక్షల నగదును, గ్రూప్-1 ఉద్యోగం, 1000 గజాల స్థలం ఇస్తామని ఆయన ప్రకటించారు. కోచ్ పుల్లెల గోపీచంద్ కు రూ. 15 లక్షలు నజరానాగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ నేటి కాలంలో ఉన్నత విద్యాభ్యాసం చేసినప్పటికీ మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో బాగా ఆటలు ఆడితే ఆరోగ్యంతో పాటు జీవితంలో కూడా ఒక గమ్యాన్ని చేరుకుంటారని అందుకు ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయని ఆయన తెలిపారు. గ్రూప్- 1 ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రభుత్వాలకు కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెంచేందుకు ప్రయత్నించిన వారిని ఆ పదవిలో నియమించడమే సరైందని గుర్తించి శ్రీకాంత్ కు ఈ అవకాశం ఇస్తున్నానని చంద్రబాబు తెలిపారు. గతంలో బ్యాడ్మింటన్ అంటే చైనా, జపాన్ తదితర దేశాలే గుర్తుకొచ్చేవని.. ఇప్పుడు గోపీచంద్ శిక్షణతో తెలుగు వారైన మల్లీశ్వరి, సానియా, సింధు, తదితరులు సైతం అద్భుతంగా రాణిస్తున్నందున రాజధాని అమరావతిలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచంలోని అత్యుత్తుమ క్రీడా శిక్షకులను ఇక్కడకు తీసుకొస్తామన్నారు. అమరావతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయమని గోపీచంద్ను కోరగా ఆయన అంగీకరించారన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో తమ లాంటి క్రీడాకారులు విజయం సాధిస్తున్నారని, ఆయన స్పూర్తి అత్యద్భుతమని పేర్కొన్నారు. ఆ తరవాత ఆంద్రప్రదేశ ప్రభుత్వం తరుపున్ చంద్రబాబు శ్రీకాంత్ కు 50 లక్షల చెక్కును అందజేసి, ఆయనను సత్కరించారు. శ్రీకాంత్ విదేశాలలో కొనుగోలు చేసిన షటిల్ బ్యాట్ ను చంద్రబాబుకు బహుకరించారు. ఆ షటిల్ బ్యాట్ తో ఇరువురు కొంతసేపు ఆడి సరదాను తీర్చుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి.