అమరావతి, మార్చి 16 : వైకాపా జగన్, జనసేన పవన్ కళ్యాణ్ తో కేంద్ర డ్రామాలాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేడు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి వ్యతిరేకంగా మహా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. "అవిశ్వాసం పెట్టు.. రాజీనామాలు చేయించు అని వైకాపా జగన్ తో.. అలాగే ఆమరణ నిరాహార దీక్ష చేయి నీ ద్వారానే ప్రత్యేక హోదా తీసుకొస్తాం" అంటూ పవన్ కళ్యాణ్ తో కేంద్రం డ్రామాలు నడిపిస్తోందని దుయ్యబట్టారు. ఇవ్వన్ని ప్రజలు గమనిస్తున్నారని.. వారికీ తగిన సమయంలో ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. దోషులను వదిలిపెట్టమని, తప్పకుండా ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతామన్నారు.