హైదరాబాద్, మార్చి 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎజెండానే జాతీయ ఎజెండా కానుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై కేటీఆర్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణాను సాధించి రుణం తీర్చుకున్నారు. అలాగే భారత పౌరుడిగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతమాత రుణం తీర్చుకుంటారని తెలిపారు. ఇప్పటికే యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని.. సరికొత్త రాజకీయాలకు స్పందిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఏమి కావాలో అదే కేసీఆర్ అజెండా.. అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకులది కేవలం అధికార ఆరాటమే. ఆనాడు హరీష్ రావు ప్రజాసంక్షేమం కోసం శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడుతుంటే కాంగ్రెస్ పార్టీ అనవసరపు రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు.