హైదరాబాద్, జూన్ 28 : అల్లు అర్జున్, పూజాహేగ్డే కలయికలో వచ్చిన దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాను కొంతమంది అంతర్జాలంలో పైరసీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ కలిసి హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరవాత దిల్ రాజు విలేకరులతో మాట్లాడుతూ డీజే సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను, కలెక్షన్లను చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆ కారణంగానే తమను దెబ్బ తీసేందుకే సామాజిక మాధ్యమాలలో ఈ సినిమాను పోస్ట్ చేశారని ఆరోపించారు. హరీష్ మాట్లాడుతూఈ సినిమా మొదటి వారం లోనే భారతీయ సినిమా చరిత్రలో తొలి ఐదు చిత్రాలలో ఉంటుందని చిత్రబృందం ఆశించిన నేపథ్యంలో, గత రెండు రోజుల నుంచి సోషల్ వెబ్ సైట్ లలో డీజే సినిమాను చాలా మంది పైరసీ చేయడం వల్ల ఆ రికార్డులను చేరుకోలేమని తెలిపారు.