అమరావతి, మార్చి 13 : 40ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. రాష్ట్రానికి ఏం కావాలో నాకు తెలీదా.? నాకు వ్యక్తిగతంగా పదవులు కావాలని అడిగానా? రాష్ట్రం కోసమే నా పోరాటం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ధ్వజమెత్తారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. "1995లో ముఖ్యమంత్రి అయ్యాను. తొమ్మిదేళ్లుగా పదవిలో ఉన్నా. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. మళ్లీ నాలుగేళ్ల నుంచి సీఎంగా ఉన్నాను. రాష్ట్రానికి సంబంధించి నా కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో నేనూ ఒకడిని. అలాంటి నాకు రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలియదా?" విభజన హామీలపై భాజపా నేతలు అన్యాయంగా మాట్లాడుతున్నారు. "సెంటిమెంటుతో డబ్బులు రావని చెబుతున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి.. రాష్ట్రాన్ని సెంటిమెంటు పేరుతోనే విభజించిన సంగతి గుర్తులేదా? అంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రాన్ని గవర్నర్ పదవి అడిగానా? మంత్రి పదవి అడిగానా? రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని అడగడానికి రాష్ట్ర భాజపా నేతలకు మొహమాటం ఉందేమో? నాకు లేదు" విభజన చట్టంలో ఉన్న హామీలన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేయాలని పేర్కొన్నారు.