హైదరాబాద్, మార్చి 9 : జైలులో ఉన్నపుడు తన హత్యకు కుట్ర జరిగిందని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని వెనుక ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. వారి పేర్లను త్వరలోనే బయటపడతానన్నారు. సికింద్రాబాద్లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జనవరి 6న దీక్ష చేస్తున్న సమయంలో కావాలనే ప్రభుత్వం పోలీసులతో తనను అరెస్టు చేయించి అన్యాయంగా రెండోసారి జైలుకు పంపిందన్నారు. తనకు ఎలాంటి హాని జరిగినా అది కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మాదిగల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోరుతూ ఈ నెల 13న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు.