న్యూఢిల్లీ, మార్చి 9 : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కార్తిని మనీలాండరింగ్ ఆరోపణలతో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం విచారణ జరుపుతోంది. అయితే ఈడీ తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కార్తి హైకోర్టును కోరగా కోర్టు అంగీకరించింది. మార్చి 20 వరకు ఈడీ కార్తిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో కార్తికి ప్రత్యేక న్యాయస్థానం ఒకవేళ బెయిల్ ఇస్తే తర్వాతి విచారణ జరిగే వరకు ఈడీ ఆయనను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన సమన్లను, తనపై జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ కార్తి దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని కేంద్రానికి, ఈడీకి కోర్టు నోటీసులు పంపించింది.