కొణిజెర్ల, మార్చి 9: ఖమ్మం జిల్లా కొణిజెర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. వర్ధన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్కు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అమ్మాజీ దుర్గతో పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో వివాహం జరిగింది. అక్కడి నుంచి ఇన్నోవా వాహనంలో వర్ధన్నపేటకు వస్తుండగా కొణిజెర్ల సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు రామకృష్ణ ప్రసాద్, అతడి బంధువులు శరత్, శ్రీదేవి, పద్మలతో పాటు డ్రైవరు వేణు అక్కడికక్కడే మృతి చెందారు. పెండ్లి కుమార్తె దుర్గతో పాటు బంధువుల పిల్లలు రామన్, మహతి, కృష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి ఏసీపీ ప్రసన్నకుమార్, ఎస్సై సురేష్లు చేరుకుని విచారణ చేపడుతున్నారు.