చెన్నై, మే 28 : సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న తమిళనాడు రాజకీయంలో పాగా వేయాలని బిజెపి పావులు కదుపుతోంది. ఇందుకు అందివచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రంలో పర్యటించిన కేంద్రమంత్రి రాధాకృష్ణన్ ప్రకటన అందుకు ఊతం ఇస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని, బిజెపిలో చేరితే మరింత ఆనందదాయకమని ప్రకటించారు. రాజకీయ సందిగ్దత ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావడం శ్రేయస్కార నిర్ణయమని, రజనీకాంత్ ప్రముఖ నాయకుడని, విశేష ప్రజాదరణ ఉన్న ఆయన రాజకీయాల్లోకి వస్తే భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తామని హామి ఇచ్చారు. ఇందులో అనుమానం లేదని.. అయితే అంతిమ నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని ప్రకటించారు.