కరీంనగర్. ఫిబ్రవరి 26 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు హాజరై.. పలు విషయాలపై ప్రసంగించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం కేసీఆర్ ఈ హైదరాబాద్ నుండి హెలీకాప్టర్లో బయలుదేరనున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు రైతులతో కలిసి ఉండి అనంతరం కరీంనగర్ మండలం తీగల గుట్టుపల్లి వద్ద ఉన్న కేసీఆర్ భవన్కు వెళ్లి, ఆ రాత్రి అక్కడే బసచేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుండి రేపు ఉదయం హెలీకాప్టర్లో బయలుదేరి పెద్దపల్లి జిల్లాకు చేరుకొని, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. కాగా రైతు సమన్వయ సమితి సదస్సుకు 17 జిల్లాల నుంచి అధికారులు హాజరు కానున్నారు. వీరితోపాటు ప్రజాప్రతినిధులు, ఇతరులు కలిపి మొత్తం 12 వేలమంది వరకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.