కర్నూలు, జూన్ 25 : గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠను ప్రేరేపిస్తున్న నంద్యాల ఉపఎన్నికలలో ఎవరికీ చోటు లభిస్తుందనే అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తర్జనభర్జన జరిగిన విషయం తెలిసిందే. దానికి తెర దించుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) తరుపున అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఆ పార్టీ అద్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆదివారం లోటస్ పాండ్ లో కర్నూలు జిల్లా నేతలతో సమావేశాన్ని నిర్వహించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డిని బరిలో దింపుతామని, అంతేకాకుండా ఆయనను నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించనున్నట్లు జగన్ తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ 'తనపై నమ్మకం ఉంచి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా చోటు కల్పించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు." ఎల్లప్పుడు పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రజలతో, నేతలతో మమేకమవుతానని ఆయన చెప్పారు. గతంలో శిల్పా మోహన్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ వదిలి వైకాపాలో చేరిన కారణంగా ఆయన ఎంపికపై ఆ పార్టీలోని నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం.