అహ్మదాబాద్, జూన్ 25 : దేశంలో హిందీ భాష వాడకం లేకుండా ప్రగతి సాధించడం అసాధ్యమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మన జాతీయ భాష హిందీ అని, ప్రతి ఒక్కరు దీనిని గుర్తించాలని సూచించారు. దక్షిణాది రాష్ర్టాల్లో ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక హిందీ భాషను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శనివారం ఆయన గుజరాత్ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడాతూ, అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలని, దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడుతున్నందున హిందీని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ముందు తమ మాతృభాషను నేర్చుకోవాలని సూచించారు. ఇంగ్లీష్ నేర్చుకోవడంతో ఉపాధి అవకాశాలు తొందరగా దొరుకుతున్నాయని, ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆ భాష వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ఈ భాషకు ఎక్కువగా అనవసర ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆధ్వర్యంలో ఇంగ్లిష్లో ప్రచురించిన మహాత్మాగాంధీ రచనల 100 సంపుటాలను కేంద్రమంత్రి సబర్మతి ఆశ్రమానికి అందజేశారు. మహాత్మాగాంధీ బోధనలు ఎప్పటికీ ఆచరణీయమని, ఈ సంపుటాలు భావి తరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.