విజయవాడ, ఫిబ్రవరి 24 : సమస్యల పరిష్కారానికి దీక్షలు చేపట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉద్యోగులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీతో శుక్రవారం ఆందోళన విరమించారు. యూనివర్సిటీ నిధుల సంరక్షణకు ప్రత్యేకంగా జీఓ విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, నాయకులు విద్యాసాగర్, ఇక్బాల్, జగదీష్, యూనివర్సిటీ ఉద్యోగుల సంఘ ప్రతినిధులతో మంత్రి సచివాలయంలో సమావేశమై చర్చించారు. అమరావతిలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సీఆర్డీఏ ద్వారా స్థలం కేటాయింపు, యూనివర్సిటీకి కేటాయించే నిధులు రూ.6 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పెంచడం, అడ్హక్ ఉద్యోగుల జీతాల పెంపుదలపై అంగీకారం కుదిరింది. దీనిపై సంతృప్తి చెందిన ఉద్యోగులు దీక్షలను విరమించి శనివారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు వెల్లడించారు.