న్యూ ఢిల్లీ, జూన్ 25 : దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమలు కానున్న వస్తుసేవల పన్నుపై మరింత అవగాహన కల్పించడానికి దేశంలో 100 జీఎస్టీ క్లినిక్లను నిర్వహించనున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) తెలిపింది. ఇందుకోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాలీ సొల్యూషన్స్, మాస్టర్ కార్డ్ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత పన్ను విధానం నుంచి జీఎస్టీలోకి వ్యాపారులు సులభంగా మారడం కోసం తొలి అవగాహన కార్యక్రమాన్ని జూలై 1న ప్రారంభిస్తామని తెలిపింది. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ప్రాథమిక అంశాలతో పాటు ఇతర టెక్నాలజీ వినియోగం, డిజిటల్ చెల్లింపులను జీఎస్టీకి అనుసంధానించడం తదితర అంశాలపై వ్యాపారులకు అవగాహన కల్పించనున్నారు. జీఎస్టీ క్లినిక్లను వ్యాపార సంఘాల కార్యాలయాలు, మార్కెట్లతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు శాఖల్లో నిర్వహిస్తామని సీఏఐటీ అధ్యక్షుడు బీసీ భర్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేవాల్ మీడియాకు వెల్లడించారు. ఆరు కోట్ల మంది వ్యాపారులకు దగ్గర కావడమే ప్రధాన లక్ష్యంతో వీటిని నిర్వహించనున్నారు.