తిరువనంతపురం, ఫిబ్రవరి 20 : కేరళ ప్రభుత్వం మానవరహిత పారిశుద్ధ్య నిర్వహణకు ఒక అడుగు ముందుకేసింది. త్వరలోనే ఈ మ్యాన్హోల్స్ శుభ్రం చేసేందుకు రోబోలను అందుబాటులోకి తీసుకురానున్నారు. జెన్రోబోటిక్స్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన రోబోలను గతవారం ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు. ఈ మేరకు కేరళ వాటర్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.శైనమోల్ మాట్లాడుతూ.. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. పైపు లీకేజీలు, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ రోబోలో వైఫై, బ్లూటూత్, కంట్రోల్ ప్యానల్స్ ఉండగా.. దీనికి నాలుగు చేతుల్లాంటి పరికరాలు, ఒక బకెట్ సిస్టమ్ అనుసంధానమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.