మంచిర్యాల, ఫిబ్రవరి 17: రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో అండాలమ్మ కాలనీలో మున్నూరు కాపు సంఘం ట్రస్టు సభ్యులు ఏర్పాటుచేసే హాస్టల్కు శంకుస్థాపన చేసేందుకు మంత్రి వచ్చారు. భూమిపూజ చేసిన అనంతరం పక్కనే సభా వేదికను ఏర్పాటుచేయగా అక్కడికి వెళ్లి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు టపాసులు పేల్చారు. ఆ టపాసుల రవ్వలు టెంట్లపై పడడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో టెంట్ల కింద ఉన్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మంత్రి జోగు రామన్న సురక్షితంగా బయటపడ్డారు.