చిత్తూరు, జూన్ 25 : వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన చెత్త డంపింగ్ యార్డు తరలింపు కోసం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనే నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. మంచినీళ్లు కూడా ముట్టకుండా చిత్తూరు సబ్ జైలులో దీక్ష చేస్తున్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. తన పోరాటాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రామాపురంలో చెత్త డంపింగ్ యార్డును తరలింపు డిమాండ్ తో నిరాహారదీక్ష చేపట్టిన చెవిరెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శనివారం పుత్తూర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఆయనను పోలీసులు చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. తమ తరపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ కు నిరసనగా రామాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో వీరికి రామచంద్రాపురం, తిరుపతి రూరల్ ప్రజలు మద్దతు పలికారు. ఈ కేసులో చెవిరెడ్డితో పాటు పలువురిపై పోలీసులు కేసునమోదు చేశారు. దీంతో పుత్తూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.