భూపాలపల్లి, ఫిబ్రవరి 2 : శ్రీ సమ్మక్క, సారలమ్మల జాతరను పురస్కరించుకొని నేడు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావులు నేడు మేడారం రానున్నారు. వీరి రాకకై ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లను చేసింది. మేడారంలోని గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న పోలీసు క్యాంపు వద్ద మూడు హెలిప్యాడ్లు, గద్దెల ప్రాంగణం పక్కన ఆధునిక టెంట్లతో గుడారాలను ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మేడారం విచ్చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కేసీఆర్ మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి, 1:15 గంటలకు మేడారం చేరుకుంటారు. అక్కడ అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.