న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఈ రోజు బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్యంకు పెద్దపీట వేసింది. వార్షిక బడ్జెట్ 2018-19లో ‘జాతీయ ఆరోగ్య భద్రతా పథకం’ పేరిట కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ నిధులతో నడిచే అతిపెద్ద ఆరోగ్య భద్రతా కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ప్రతి పౌరుడికి వైద్యాన్ని దగ్గర చేసేందుకు వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రూ.1200 కోట్లను కేటాయించారు. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని, పదికోట్ల కుటుంబాలకు దీన్ని వర్తింపచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి వెల్లడించారు.