చిత్తూరు, జూన్ 23 : వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి చురుకైన పాత్ర పోషించే రోజా గత కొన్ని రోజుల నుంచి అలా ఉండటం లేదని, జగన్ తో విబేధాలు కొనసాగుతున్నాయని దీనికి కారణం కొంతమంది వైకాపా నాయకులే అని సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలు ప్రజల్లో ఉత్కంఠను ప్రేరేపిస్తున్నాయి. రోజా ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైకాపాలో తన ప్రాధాన్యత తగ్గిపోతుందని రోజా భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ నుండి వైదొలగాలని రోజా ప్రయత్నిస్తున్నట్లు వైకాపా శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి. గురువారం విశాఖపట్నం వైకాపా ఏర్పాటు చేసిన మహాధర్నాకు రోజా హాజరుకాలేదు. ఎందుకంటే వైకాపా నిర్వహించిన సర్వేలో చిత్తూరు జిల్లాలో పార్టీ తరుపున ప్రజా సమస్యలపై రోజా దృష్టి నిలపడం లేదని, ఆమె పనితీరు పార్టీకి హాని కల్గిస్తుందని వెల్లడైంది. అందుకు జగన్ రోజాను మందలించారనే ప్రచారం జరుగుతుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ జబర్దస్త్ కార్యక్రమంలో రోజాతో సహా పాల్గొనే నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సోదరుడు. ఆ చొరవతో వైకాపాలో రోజా తన బాధను పవన్ తో చెప్పగా, ఆమెను జనసేన పార్టీలోకి స్వాగతించినట్లుగా కథనాలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే నిజమైతే వైకాపా మరో నేతను కోల్పోవాల్సి ఉంటుంది.