న్యూ ఢిల్లీ, జూన్ 23 : దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన జీఎస్టీ అమలుకు సంపూర్ణ సహకారం అందించిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం కృతజ్ఞతలు తెలిపింది. ఈ నెల 30న అర్ధరాత్రి నుంచే వస్తు సేవల పన్ను అమల్లోకి రానుండగా, ఏకీకృత పన్ను కలిగిన దేశంగా భారత్ నిలువనున్నది. దీంతో జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వడంతో పాటు, పలు రాష్ట్ర శాసన సభల్లో ఆమోదం పొందడానికి చొరవ చూపిన ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రివర్గం కృతజ్ఞతతో కూడిన ఒక తీర్మానాన్ని తెలిపింది. అనంతరం ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో జీఎస్టీ సులభతర వ్యాపారానికి దారులు ఏర్పడుతాయని, దీంతో పాటు పన్ను భారం తగ్గుతుందని కేంద్ర వర్గం వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు, రాజకీయ పార్టీల మధ్య సన్నిహిత సహకారం ఉండబట్టే జీఎస్టీ ఆమోదం సాధ్యమైందని పేర్కొన్నారు.