అమరావతి, జూన్ 23 : భారత రాష్ట్రపతి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ఇతర మిత్రపక్షాలు రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేసిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబు పాల్గొని, నామినేషన్ ని బలపరుస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక ఏకగ్రీవమైతే బాగుండేదని, అయినప్పటికీ పోటీ నామమాత్రమేనని, రామ్ నాథ్ కోవింద్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా తరుపున రామ్ నాథ్ గెలుపుకు పూర్తి సహాయం అందిస్తామని, ఈ పాటికే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీతో భాజపా అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే విషయంపై మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు.