బెంగుళూరు, జనవరి 28 : ఐపీఎల్-11 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ నిన్న బెంగుళూరు వేదికగా జరిగింది. ఈ సారి వేలంలో ఫ్రాంఛైజీలు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అభిమానులను ఆశ్చర్య పరిచారు. ఈ మెగా టోర్నీ కోసం ఆయా జట్లు యువ ఆటగాళ్లపై కోట్లాభిషేకం చేశారు. గత ఏడాది అత్యధిక ధర పలికిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ను 12.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ జట్టు దక్కించుకొంది. భారత్ ఆటగాళ్లలో కే. ఎల్ . రాహుల్ ను 11 కోట్లు పంజాబ్ వశం చేసుకోగా, యువ ఆటగాడు మనీష్ పాండే ను అదే ధరకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. సీనియర్ విభాగంలో హర్భజన్, గంభీర్, టీ20 స్పెషలిస్టులు యువరాజ్, యూసఫ్ పఠాన్లు తక్కువ ధర పలకడం గమనార్హం. పొట్టి క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న రషీద్ ఖాన్ కోసం సన్రైజర్స్ రూ. 9 కోట్లు ఖర్చు చేసింది. తొలి రోజు వేలంలో మొత్తం 578 మంది క్రికెటర్లలో 110 మందిని వేలం వేయగా.. 78 మంది అమ్ముడుపోయారు. ఇందులో 49 మంది భారత క్రికెటర్లు, 51 మంది అంతర్జాతీయ క్రికెటర్లు, మిగతా 27 మంది దేశవాళీ ఆటగాళ్లు ఉన్నారు. మిగతావారి కోసం ఈ రోజు వేలం కొనసాగుతుంది.