హైదరాబాద్, జనవరి 26 : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో, తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ రోజు చిత్ర బృందం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార ఆడియోను విడుదల చేసింది. ఆడియోలో..‘భరత్ అనే నేను..శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను, శ్రద్ధతో, శుద్ధితో నిర్వహిస్తానని, భయంగా కానీ పక్షపాతంగా కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని , శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.’ అని మహేశ్ చెప్పడం హైలైట్గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్లుక్లో మహేశ్బాబు సూట్కేసు పట్టుకుని నడుచుకుంటూ రావడం చాలా స్టైలిష్ గా ఉంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా, మహేశ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.