హైదరాబాద్, జనవరి 25 : మాస్ మహారాజా రవితేజ.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత "రాజా ది గ్రేట్" సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), దర్శకత్వంలో "టచ్ చేసి చూడు" అంటూ ప్రేక్షకులను కనువిందు చేయడానికి సిద్దంగా ఉన్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను చిత్రబృంద౦ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆరంభంలో రవితేజ తనదైన శైలిలో.. "ఎ ఫ్యామిలీ ఈజ్ యాన్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్. అసలు ఫ్యామిలీ అంటే.. అని చెప్తుండగా వెనక నుంచి ఎవరో వద్దురా రేయ్ వద్దు.. అన్న డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.. యూనిఫాంలో ఉంటే ఆరే బుల్లెట్లు. యూనిఫాం తీసేస్తే రాయితో చంపుతానో రాడ్తో చంపుతానో నాకే తెలీదన్న డైలాగ్ ఈ చిత్రంపై ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని వల్లభనేని వంశీ నిర్మిస్తు౦డగా ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.