హైదరాబాద్, మే 25 : మహానగరానికి ఉగ్రముప్పు పొంచి ఉంది. వారు ఏ సమయంలోనైనా దాడులకు తెగబడవచ్చునన్న హెచ్చరికల నైపధ్యంలో హై అలర్ట్ ప్రారంభం అయ్యింది. కేంద్రం ఢిల్లీ, ముంబైలకు ముందే హెచ్చరికలు జారీ చేయగా.. మరింత పరిశోధన నిర్వహించిన అనంతరం హైదరాబాద్ కు సైతం ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వెలువరించారు. సరిహద్దు దాటిన ఉగ్రవాదులు ఏ రూపంలోనైనా విరుచుకుపడే అవకాశం ఉండడంతో అన్ని చోట్ల బందోబస్తును ముమ్మరం చేశారు. ప్రధాన చౌరస్తాలలో, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో పగడ్బంధి బందోబస్తు చర్యలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా పలు ప్రదేశాలలో నాకాబంది నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు, తదితర అనుమానిత ప్రదేశాలపై నిఘాను పెంచారు. 2008 నవంబర్ 29న జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశంలో ఆ తరహా దాడులు జరిగేందుకు అవకాశం లేకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.