హైదరాబాద్, జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవ౦ సందర్భంగా నేడు రవీంద్ర భారతిలో వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమి ఉండదని అనుకోకండి. నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు. నీ స్వరం వినిపించినా ఎలాంటి ప్రయోజనం ఉందని ఎవరైనా అంటే నమ్మవద్దు. నీ స్వరం కొన్ని లక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు" అంటూ ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్న గవర్నర్.. ప్రతి ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.