విజయవాడ, జనవరి 18 : నేడు ఉదయం కేంద్రం పౌరవిమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు గన్నవరం నుంచి ముంబయికి విమాన సేవలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఏటా లక్షల్లో ఉంటోంది. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గన్నవరం నుంచి ముంబయికి విమాన సేవలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. భారతదేశానికే గేట్వే లాంటి మహానగరం ముంబయి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలకూ గంటకో విమాన సర్వీసు ఉంటుంది. విజయవాడ నుంచి నేరుగా ముంబయి విమానాశ్రయంలో దిగిపోతే, అక్కడి నుంచి కనెక్టివిటీ విమాన సర్వీసును అందుకుని ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లిపోయేందుకు మార్గం సుగమం అవుతుందని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా బోయింగ్ 737-800 విమాన సేవలను ప్రారంభించింది.