చెన్నై, జనవరి 19 : వచ్చే శాసనసభ ఎన్నికల్లో తప్పక మార్పు వస్తుందని ప్రముఖ నటుడు విశాల్ అన్నారు. ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్, కమలహాసన్ రాజకీయ రంగ ప్రవేశంపై విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. "రజినీ, కమల్ రాజకీయాలకు కాస్త ఆలస్యంగా వచ్చినా.. వారు తీసుకున్న నిర్ణయం మాత్రం సరైంది. కాని ప్రజలు ఇద్దరిలో ఎవరికీ ఓటు వేస్తారన్న విషయం మాత్రం చెప్పలేను. రానున్న శాసన సభ ఎన్నికల్లో తప్పకుండా మార్పు వస్తుందన్న నమ్మకం ఉంది. నా నామినేషన్ తిరస్కరించిన అంశం నన్ను మరింత బలవంతుడిని చేసింది" అంటూ పేర్కొన్నారు.