హైదరాబాద్, జనవరి 18 : తెలంగాణ టీడీపీ పార్టీని తెరాసలో విలీనం చేస్తే బాగుంటుందని సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తెదేపా ప్రభావం కోల్పోతుందన్న మాటలు వింటుంటే బాధగా ఉంటుంది. పార్టీని ముందుండి నడుపుదామంటే సహకారం కరువవుతోంది. తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పిస్తే బాగుండేది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులందరూ తెదేపా నుంచి వెళ్లిన వారే. ఇలాంటి పరిస్థితుల్లో తెదేపాను తెరాసలో విలీనం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అంతేకాకుండా అదే గౌరవంగా కూడా ఉంటుంది. అలా కుదరకపోతే చంద్రబాబు ఇతర పార్టీలకు దీటుగా నడపాల్సి ఉంటుంది అని వెల్లడించారు.