చెన్నై, జనవరి 17: అవయవ మార్పిడిలో దేశంలోనే తమిళనాడు అగ్ర తాంబూలం అందుకొని, మార్గదర్శిగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. చెన్నై పర్యటన సందర్భంగా గ్లోబల్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణుడు మహ్మద్ రేలా ఏడేళ్లలో వెయ్యి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తిచేసిన క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవయవ మార్పిడి విషయంలో ఇతర రాష్ట్రాలు కూడా తమిళనాడును అనుసరించాలని సూచించారు. దేశంలో అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఒకప్పుడు కాలేయ మార్పిడి చేసుకోవాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది శస్త్రచికిత్సల కోసం మన దేశానికే వస్తున్నారని ఆయన గర్వించారు.