తులం బంగారం@ రూ.30,750

SMTV Desk 2018-01-13 17:08:27  gold, rates, increase, pongal, season

న్యూఢిల్లీ, జనవరి 13: సంక్రాంతి పండుగ సీజన్‌లో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేటి బులియన్‌ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏడు వారాల గరిష్టంలో వంద రూపాయలు పెరిగి 30,750 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్‌ సంకేతాలు మాత్రమే కాకుండా.. డాలర్‌ విలువ పడిపోవడం, స్థానిక ఆభరణ వర్తకదారుల నుంచి కొనుగోళ్లు దేశీయ స్పాట్‌ మార్కెట్‌లో బంగారం ధరను పెంచుతున్నాయని బులియన్‌ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. గ్లోబల్‌గా బంగారం ధరలు ఒక్కో ఔన్స్‌కు 1.17 శాతం పెరిగి 1,337.40 డాలర్లుగా నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 10 గ్రాములకు 30,750 రూపాయలుగా, 30,600 రూపాయలుగా ఉన్నాయి. అదేవిధంగా వెండి ధరలు కూడా దేశీయంగా 100 రూపాయలు లాభపడి కేజీకి 39,900 రూపాయలకు పెరిగాయి.