బీజింగ్, జూన్ 21: నేటి కాలంలో ప్రతి వస్తువును ఆన్ లైన్ లోనే తీసుకునే వెసులుబాటును కల్పించడంలో ఆయా సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులను మనం చెప్పిన చిరునామాకే కొరియర్ల ద్వారా అందించేలా డెలివరీ బాయ్స్ లను సంస్థలు నియమిస్తున్నాయి. కాని ఇక ముందు డెలివరీ బాయ్స్ ల స్థానంలో రోబోలు రాబోతున్నాయట. ఇప్పటికే అమెజాన్ లాంటి ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు వారి ఆర్డర్లను ఆకాశ మార్గాన డ్రోన్ల సాయంతో డెలివరీ చేస్తున్నాయి. తాజాగా చైనాలో ఓ ఆన్లైన్ షాపింగ్ సంస్థ తమ ఆర్డర్లను రోడ్డుమార్గంలో రోబోతో డెలివరీ చేయిస్తోంది. జేడి.కామ్ అనే ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఈ నూతన డెలవరీ రోబోలను వినియోగంలోకి తీసుకొచ్చింది. నాలుగు చక్రాలతో డబ్బా మాదిరిగా ఉండే ఈ రోబో తొలి కొరియర్ను బీజింగ్లోని రెన్మిన్ యూనివర్శిటీలో డెలివరీ చేసింది. అంతేకాదు.. దేశంలోని పలు యూనివర్శిటీలకూ కొరియర్లను రోబోతో డెలివరీ చేయించారు. ఈ రోబో ఆప్టిమల్ రూట్ ఆధారంగా నడుస్తుంది. కొరియర్ తీసుకునే వారికి గమ్య స్థానం చేరుకునే ఐదు నిమిషాల ముందు సందేశం పంపుతుంది. వారిని ముఖాల ద్వారా గుర్తించి కొరియర్ డెలివరీ చేస్తుంది. ఈ రోబోకు లేజర్ రాడార్స్.. కెమెరాలు అమర్చి ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. ఏ వాహనానికి ఢీకొట్టకుండా ప్రయాణిస్తుంది. గంటకు మూడు నుంచి నాలుగు కి.మీ తిరగగలిగే ఈ రోబో 6 నుంచి 20 కొరియర్లను డెలవరీ చేయగలుతుందట. వచ్చే ఏడాది 100కి.మీ ప్రయాణించేలా రోబోలను రూపొందించి బీజింగ్.. హంగ్జు.. జెజియంగ్.. క్సియన్ ఆఫ్ షాక్సి వంటి ప్రావిన్సుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జేడీ.కామ్ సంస్థ ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే.. ఈ ప్రావిన్సుల్లో యూనివర్శిటీలు.. కాలనీలు అధికంగా ఉంటాయని సమాచారం.