హైదరాబాద్, జనవరి 13 : తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు వరాలు ఇవ్వనుంది. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వచ్చే విద్యాసంవత్సరం నుండి ఉచితబస్ పాస్ తో పాటు విద్యార్థులకు కాలేజీలో మధ్యాహ్న భోజన వసతి కల్పించనుంది. ఈ విషయంపై ఆర్టీసీ, ఇంటర్ బోర్డు తో సంప్రదింపులు జరపనున్నారు. ఈ నిర్ణయంతో ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇదివరకే ప్రవేశ రుసుమును రద్దు చేసింది. అంతకు ముందు సైన్స్ గ్రూప్ లో చేరే విద్యార్థి రూ.1100, ఆట్స్ గ్రూప్ విద్యార్థులు రూ.500లు, వృత్తి విద్యాకోర్సులు రూ.1200 రుసుం చెల్లించే వారు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరింది. కాగా ఈ కొత్త పథకాలు వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రతీ కాలేజీల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.