న్యూ డిల్లీ, జనవరి 11: కులాంతర వివాహం చేసుకొని కుటుంబానికి దూరంగా ఉండే జంటలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రం చిరు కానుకను ప్రకటించింది. వివాహ అనంతరం సమాజంలో వారు నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతూ.. అనేక ఆర్దిక ఇబ్బందులను చవిచూసేవారు. ఈ జంటల సాయం కోసం 2013లో వచ్చిన చట్టానికి కేంద్రం సవరణలు చేస్తూ రూ.2.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పతకంలో ఇంతకు ముందు ఆదాయ పరిమితి రూ.5 లక్షలు ఉండగా ఆ విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. ఈ నిర్ణయం ఉపసంహరించుకోవడంతో చాలా మందికి మేలు జరిగే అవకాశముంది. దీని ద్వారా లబ్ది పొందడానికి పెళ్లి చేసుకున్న జంటలో ఒకరు ఎస్సీలై ఉండాలి. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఈ కులాంతర వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టరు చేయాల్సి ఉంది. ఇలా నమోదైన జంట ధ్రువీకరణ పత్రం తీసుకుని ఎస్సీ సంక్షేమశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పెళ్లి పత్రిక, రేషన్కార్డులతోపాటు కులధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ ఉండాలి. ఇది కాకుండా ఇద్దరి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న జంట గురించి గ్రామంలో సంబంధిత శాఖ విచారిస్తుంది. విచారణ పూర్తి కాగానే వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు. వీరేకాకుండా ఇతర ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన వారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం.