అమరావతి, జనవరి 11 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు మరోసారి నిలిచిపోయాయి. వచ్చే ఏడాదికల్లా పోలవరం ప్రాజెక్టును సిద్ధం చేస్తామన్న ధీమాతో ప్రభుత్వం ఉంది. చిన్న చిన్న సమస్యలు వెంటాడుతున్నాయన్న వాస్తవాలను అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత 2,3 నెలలుగా కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ జీతాలు ఇవ్వటం లేదని సిబ్బంది విధులు బహిష్కరించారు. సిబ్బంది నిరసనలతో కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. ఈ నెల 10 నుంచి కార్మికులు, ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. రాళ్లు, టైర్లు అడ్డుపెట్టి ఇతర వాహనాలు వెళ్లకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇప్పటికే ఆపరేటర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లు విధులు బహిష్కరించారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్, కార్మికశాఖ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.