నిడమనూరు, జనవరి 10 : నల్గొండ జిల్లా నిడమనూరు సెంట్రల్ బ్యాంకులో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి, రుణాలు పొందిన కేసులో నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పాస్ పుస్తకాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారని నిడమనూరు తహసీల్దార్ మందడి నాగార్జున రెడ్డి గతేడాది డిసెంబర్ 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన పోలీసులు బొజ్యాతండాకు చెందిన నేనావత్ శ్రీను ప్రధాన సూత్రదారిగా గుర్తించారు. మాజీ వీఆర్వో ఇంటి నుంచి 32 పాత పాస్ పుస్తకాలను సేకరించి, రబ్బర్ స్టాంపులు తయారు చేసి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. నకిలీ రుణాల్లో ఇప్పటికే రూ. 22 లక్షల వరకు బ్యాంకుకు చెల్లించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులుగా ఉండగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.