మచిలీపట్నం, జనవరి 9 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60కు పైగా ఆర్వోబీలు నిర్మాణంలో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ తెలిపారు. గత ఏడాది రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి ఆశాజనకంగా ఉందన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు కొత్త లైన్లు, ప్రతిపాదనలపై రైల్వే అధికారులతో ఎంపీలు చర్చించారు. ఈ సందర్భంగా విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి తెదేపా, వైకాపా పార్లమెంట్ సభ్యులు హజరయ్యారు. అనంతరం రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ మాట్లాడుతూ... నడికుడి-శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను 30కిలోమీటర్ల మేర ఈ ఏడాది పూర్తవుతుందని చెప్పారు. అలాగే, తిరుపతిలో కూడా రైల్వే స్టేషన్ను రూ. 400 కోట్లలతో ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతం నుంచి రాయలసీమకు కొత్త రైళ్ల విషయంలో ప్రతిపాదనలు వచ్చాయని, వాటిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఈ మేరకు ఎంపీలతో సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని ఆయన వెల్లడించారు.