విజయవాడ, జనవరి 9 : దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యేందుకు ఈ నెల 12వ తేదీన అపాయింట్మెంట్ ఉండగా, భేటీ తేదీ మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందినట్లు తెలిసింది. ఈనెల 12, 13, 17 తేదీల్లో అపాయింట్మెంట్పై ప్రధాని కార్యాలయం అధికారులు, ఏపీ సీఎంవో మధ్య చర్చలు జరిగాయి. కాగా, 12, 13 తేదీల్లో సంక్రాంతి పండుగ ఉన్నందున, సమావేశమయ్యే తేదీని పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎంవో అధికారులు ప్రధాని కార్యాలయానికి తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ నెల 17న ప్రధాని మోదీతో సీఎం అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.